Pages

6 సెప్టెం, 2009

నా తొలిగురువు.. కల్పతరువు

kanchi...... swamy     , .... pets  ..may 7th 151

 

ముద్దుమాటల వయసులో

మువ్వన్నెలకి  అర్థం  చెప్పి

మూడు రంగుల జెండా చేతిలో పెట్టి

వీధి వీధినా నన్నూ నాతో పాటుగా నా నేస్తాల్నీ

ఊరేగిస్తూ, మా బులి బులి పాదాల్లో తన  పాదాలు కలుపుతూ

కమ్మని కోకిలగా ఆ స్వరంలో అమృతాన్ని మాపై వెదజల్ల్లుతూ

నిద్రిస్తున్న బద్ధకస్తుల చెవులు చిల్లులు పడేలా… ఊరంతా వినబడేలా..

అలుపుతెలియని శ్రామికుడై గొంతు అరిగేటంత వరకు.. ప్రతి ఏటా పాడిన పాటలే

అయినప్పటికీ  ఆ గానం ఎప్పటికీ అలాగే కొన సాగాలనేలా …. ప్రతి చెవినీ పరవశింప జేసి

దేశమంటే మట్టి కాదోయ్.. నిన్ను మించిన దేశమేదోయ్… ? అంటూ నరనరాల్లో దేశభక్తిని నూరిపోసిన

నా తొలి గురువు.. నిజంగా కల్పతరువు ! ఆ మహనీయుడు పెట్టిన భిక్షే నేటి నా మహోన్నత వ్యక్తిత్వం.

 

 

 

ఇప్పటికీ  నా మనసులో చెరగని ముద్ర వేసిన ఈ మహాను భావుడు నాకు 3 వ తరగతి ఉపాధ్యాయుడు.పేరు శ్రీ తిరుపతిరావు గారు.

ఒకటవ తరగతి నుండీ పదుల సంఖ్యలో పంతుళ్ళూ , పంతులమ్మల్నీ నియమిస్తూ ఉన్న ప్రస్తుత కాలపు దౌర్భాగ్య విద్యావిధానం పుట్టకముందు నా అదృష్టం కొద్దీ ఆయన చేతిలో పడ్డాను.

 

( 1 వ తరగతి నుండే సబ్జెక్టు టీచర్లు ఉంటే నీకేమి నష్టం అనుకునేరు. ఇంకా సబ్జెక్టు అంటే ఏమిటో తెలియని పిల్లాడికి 6+ 1 డ్రాయింగు, 1 మ్యూజిక్కు, 1డాన్సూ, 1కంప్యూటరూ, 1డ్రిల్లూ ఇలా లెక్కపెడితే ఇంకా ఈ అంకె పెరుగుతుంది సుమా! ఇంత మంది పేర్లు, ఎవరు ఏం చెబుతారో తెలుసుకుని గుర్తు పట్టే సరికి ఆ ఏడు గడిచే పోతుంది.అల్లాటిది వాళ్ల మనస్తత్వాలేమిటో , వారి ముందు ఎలా ప్రవర్తించాలో తెలియక  ఓపక్క, అందరూ ఏక దమ్మున ఇచ్చిన హోమ్ వర్కు చెయ్యలేక మరోపక్క పిచ్చి పిల్లలు కుస్తీ పడుతున్న సంగతి విఙ్ఞులు మీకు తెలియదా చెప్పండి?)

మా అమ్మా నాన్న పుణ్యమా అని అప్పట్లో అప్పుడే పుట్తుకొచ్చిన కాన్వెంటుల కేసి కనీసం కన్నెత్తి అయినా చూడకుండా నన్ను ఆ బోర్డీ స్కూలులోనే ( చిన్నపుడు అలాగే అనేవాళ్ళం) ఉంచారు. ఒక సంవత్సరం పాటు మా కదలికల్ని , మా అలోచనల్ని గమనించే అవకాశం మా మాస్టారుకీ , మా మాస్టారు గారి గొప్పతనం, వ్యక్తిత్వాలను తెలుసుకునే అవకాశం వెర్రి వెంగళప్పల మైన మాకూ కలిగిందనే చెప్పాలి.

 

ప్రతి సంవత్సరం .. ఆగస్టు 15 న మా స్కూల్లో ఉన్న సందడి అంతా ఆయనదే. జెండాలు కట్టటం నుంచి దించేదాకా అన్నీ పనులే ఆయనకి.

ముఖ్యంగా ఆయన పాడిన పాటలు ఇప్పటికీ సంవత్సరాలుగా ప్రతి ఏటా ఒక ఉపాధ్యాయురాలిగా నా విద్యార్థులకు  నేర్పిస్తూ ప్రతి ఏటా అనుకునేదాన్ని “మాస్టారు దేవుడు. ఎలాగున్నారో” అని

అటు వంటిది నా అదృష్టం కొద్దీ నేను మా స్వంత ఊరు వెళ్ళీ తిరిగి వస్తుంటే రైల్వే స్టేషన్లో. “అమ్మాయ్ ! పద్మకళా! .. ఇటు ఇటు రా !.. ఇలా …ఇక్కడా… “ అంటూ ఓ ఆత్మీయ స్వరం నన్ను ప్రేమతో పిలిచింది. నా చెవిని సోకిన ఆ స్వరం .. “ నిజంగాఅ అదే.. అమృత ధార!… అవును .. అనుకుంటుండగానే కిటికోలొంచి బైట పడి , పిలుస్తున్న చెయ్యీ, రాలేక అక్కడే ఆగిపోయి నేను ఆయన్ని చూస్తానో చూడనో అన్న సంశయంతో మా మాస్టారి ముఖం.

ఇక ఒక్క ఉరుగుకున పరుగెత్తాను .. వెళ్ళీ వెళ్ళగానే మనస్ఫూర్తిగా ( మధ్యలో ఈ మనసేమిటి ?అది ఉందని తెలియని వయసులోనే మా మాస్టారు మాకు తల్లిదండ్రుల ప్రేమను రుచి చూఫించితేను..?) ఒక్క సారిగా కాళ్లపై పడ్డ్డాను.నాగురించి చెప్పాను . మాస్టారి వివరాలు తెలుసుకున్నాను.గుప్త దానం అంటే మాస్టారికి ఇష్టం.ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

నా అభిప్రాయాలు , ఆలోచనలు పంచుకున్నాను. మాస్టారి కళ్లల్లో ఆనందం. ఆ ఆనందానికి అర్థం నాకు మాత్రమే తెలుసు.రైలు సాగిపోతోంది.

ఆగస్టు 15 నేడేనోయ్.. అందరికి స్వరాజ్య మిదియేనోయ్..

భారత మాతకు జేజేలు .. బంగరు భూమికి జేజేలు          ( ఒట్టు. ఈ పాట సినిమాలో కంటే మా మాస్టారు    పాడితేనే          బాగుంటుంది)

ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా.. మా ఐక్య జెండా.. జాతీయ జెండా/…!

బలే తాత మన బాపూజీ ! బాలల తాతా బాపూజీ..!

మాస్టారితో కలిసి చిన్నప్పటి పాటలు మళ్ళీ పాడుతుంటే జనం మురిసిపోతుంటే నేను గర్వించాను. ( నా గురువు గురించి ). మాస్టారిని అడిగాను నాకు ఏవన్నా నాలుగు ముక్కలు చెప్పండి మాస్టారూ అని.ఆయన ఏమీ నొచ్చుకోకుండా చాలా సహజంగా చిన్నప్పుడు నా సందేహాలు తీర్చినట్టే ఇలా చెప్పారు.

శీలం లేని విద్య నిరర్థకం

మనిషిని ప్రేమించు మతాన్ని కాదు

నువ్వు చల్లగా ఉండాలని తపించటం కాదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చల్లగా ఉండాలని ప్రార్థించు

సమాజం అశాంతితో ఉంటే నీ బ్రతుకులోకి శాంతి ఎలా వస్తుంది?

అందరూ భయపడితే సమాజాన్ని ఎవరు నడిపిస్తారు?

……………………

ఆయనకి బాగా ఇష్టమైన పద్యం ఒక్కటి చెప్పారు:

 

నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క

గడన సేయుటకు ఆశ పడను నేను

ఆలు బిడ్డలకునై ఆస్థిపాస్థులు కూర్ప

కడత్రోవలో పాదమిడను నేను

నేనాచరింపని నీతులు బోధించి

రాని రాగము తీయగలేను నేను

సంసార యాత్రకు చాలినంతకు మించి

గుడ్ది గవ్వను కోరుకోను నేను.

 

( అయ్యా౧ దయచేసి చందస్సు పంక్తుల జోలికి పోకండి. ఆయనకు నచ్చిన పంక్తులు ఇవి. చివరిలో కొన్ని మాయమై ఉండవచ్చు.) జాషువా రచన అని మాత్రం చెప్పారు. ఎప్పటికైనా పట్తుకుంటాను ఆ పద్యాన్ని.)

అంత మహనీయునికి ఈ రోజు కెవలం కవితానీరాజనాలు ఇవ్వాలనే తలంపుతో ఈ గురుపూజోత్సవ దినోత్సవాన ఆలస్యం చేసి ఆ భాగ్యం కోల్పోయాను. ఎప్పటికైనా ఈ పోస్టు చదువుకుంటారన్న నమ్మకం నాకుంది.

 

ఓ చదువుల తండ్రీ! నీకివే పాదాభివందనాలు. జన్మ జన్మలకీ మీ శిష్యురాలిని……

4 కామెంట్‌లు:

MURALI చెప్పారు...

కేవలం జీతాలకోసమే పనిచేసే దొంగ ప్రభుత్వ ఉద్యోగులు ఆ నాటి ఈ మేటి ఉపాధ్యాయలను చూసి నేర్చుకుంటే చాలా బాగుంటుంది.

శ్రీలలిత చెప్పారు...

పద్మకళగారూ,

మనం తరవాతి తరానికి అందించే వారసత్వం ధనమూ, పదవులూ కాదు. ఇలాంటి మంచి విలువలే. ఇప్పటికీ ఇలాంటి మహానుభావులు ఉండడంవల్లే ఇంకా మనిషిలో మంచితనం కనపడుతోంది. ఆ గురువుగారికి మనమిచ్చే గురుదక్షిణ వారు చెప్పిన నాలుగుముక్కలు పాటించి, తరవాతి తరంవారికి అందించడమే. అందులో కృతకృత్యులను చెయ్యమని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిద్దాం. మీరు మీ గురువుగారిని పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. శ్రీలలిత.

Miriyala Aravind చెప్పారు...

మీరు చెప్పింది నిజమే. మాకు ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు ఒక ఉపాధ్యాయురాలే అన్ని భోధించేవారు. మేము ఒక తరగతి నించి ఇంకో తరగతికి వెళ్ళినట్టు, మా టీచర్ గారు కూడా ప్రొమోట్ అయ్యేవారు. తర్వాత తరగతుల్లో ప్రతి సబ్జెక్ట్కి వేరు వేరు వాళ్ళు వచ్చేవారు. బాగానే చెప్పేవారు కాని వాళ్ళ గురించి మాకు తెలియదు. మా గురించి వాళ్ళకి తెలియదు.

కొత్త పాళీ చెప్పారు...

very sweet

కామెంట్‌ను పోస్ట్ చేయండి