Pages

29 అక్టో, 2008

బస్ స్టాప్ కష్టాలు

scholar DD news drctr 160 scholar DD news drctr 159 scholar DD news drctr 161

"నువ్వెక్క దల్చుకున్న బస్సు ఒక జీవితకాలం పాటు మిస్సు ." అన్నారు ఆరుద్ర గారు.

ఒక్కోసారి ఈ బస్సుల కోసం వేచి వేచి విసిగి వేసారి పోయి అసలు మనమే స్వయంగా ఓ కొత్త సర్వీసు  ఎందుకు నడపకూడదు ? అనిపిస్తుంది.

లాభాల బాట లో దూసుకెళ్తున్న ఆర్.ట్.సి. మరిన్ని బస్సులు నడిపితే ప్రజలకి సౌకర్యంతో పాటు విలువైన కాలం కూడా ఆదా అవుతుంది కదా!

కానీ వాళ్ళా పని చేయరు.

ప్రొద్దున్నే లేచి హడావుడిగా తినీ తినక పరుగులెత్తి చురకపెట్టే  ప్రొద్దుటెండలో ఇలా నిలబడితే ఉన్న ఓపిక కాస్తా బస్ స్టాప్ లోనే ఖతం.

ఆఫీసుకో ,స్కూలుకో ,బ్యాంకుకో ఎక్కడికయినా సరే పనిచోటుకు చేరాక నీరసం.

టైం కి చేరగలమో లేదో అన్న ఒత్తిడిలోంచి బయటపడి పనిచెయ్యాలంటే కొంత సమయం తీసుకుంటుంది.

దాని వల్ల పనిసామర్థ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది.

అసలు మన 70,80 ఏళ్ళ జీవితంలో సుమారు ఒక వంతు బస్టాపుల్లోనే గడిచి పోతుందేమో కదా!

’ఆశ - నిరాశ’ అనే వ్యంగ్య వ్యాసం లో శ్రీ నండూరి రామ మోహన రావు గారు ఇలా అంటారు.

"బస్సును గురించి ఎదురు చూసేటపుడు నిరాశ చాలా ఉపయోగపడుతుంది.మనం ఎదురు చూసే బస్సురానపుడు ’వచ్చే బస్సు మన నంబరు బస్సు కాదు,

వేరే నంబరు బస్సు అని అనుకుంటూ మనమేదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉంటే మన నంబరు బస్సే వచ్చేస్తుంది."

అవును. ఈ అనుభవం నాకు చాలా సార్లు అయ్యింది. ఆ వచ్చేది మన బస్సే ! హమ్మయ్యా ! అనుకున్నప్పుడల్లా అది ఖచ్చితంగా వేరే బస్సే అయ్యితీరుతుంది.

ఈ అనుభవం రోడ్డెక్కిన ప్రతివారికీ ఎప్పుడో ఒకప్పుడో అవుతూనే ఉంటుంది. నాకయితే ఇంట్లో చేయటానికి టైం చాలని చాలా పనులు బస్ స్టాపుల్లో చేసుకోవచ్చేమో అనిపిస్తుంది.

ఆ ఒక్క అవుడియా కూడా ఇచ్చేయనా?

పేపర్ తెరిచి అందులో మునిగితే ఇక మనకి ప్రపంచంతోనే పని ఉండదు.బస్సు హారన్ మోగినప్పుడు ఓ లుక్కేసి, బస్సులోకి గభాల్న ఎక్కేయవచ్చు.

మగవాళ్ళు అయితే నెలవారీ ఇంటి లెక్కలు, రోజు వారీ చెయ్యాల్సిన పనుల చిట్టా, వారాంతపు పనుల ను గురించిన సన్నాహాలు,

వృత్తి లో చెయ్యవలసిన పనులు, చేసి న పనుల ఫలితాలు ........

ఇలా ఆలోచనలో పడితే మన బస్సు రాకపోతుందా?

అలాగే స్టుడెంట్స్ అయితే కష్టమయిన ఫార్ములాస్, ఈక్వేషన్స్, బిట్స్, కొటేషన్స్ చిన్న చిన్న స్లిప్స్ప్ పై రాసుకుని  ఆ టైం లో చేతిలో పెట్టుకుని మధ్యమధ్యలో చూసుకుంటూ బట్టీ కొట్టేస్తే సరి.

ఇంకా ఇవన్నీ చెయ్యలేని వారు చక్కగా ఇష్టమయిన మ్యూజిక్ (ఐ పాడో,గియ్ పాడో (ఏదో ఒక పాడు)) లేదా fm వింటూ ఉంటే సరి.

ఇలా ఆలోచిస్తే చాలా ఉంటాయి. వ్యవస్థని మనం ఎలాగూ  మార్చలేం. కాబట్టి మనకనుగుణంగా పరిస్థితుల్ని, సమయాన్ని మలచుకోవటం నేర్పరుల లక్షణం అనేది నా అభిప్రాయం.

ఇదంతా సమయంతో పరుగులు తీసే వారికే సుమా !

(గడియారంతో జనం పోటీ పడి ఎక్కడయితే పనిచేస్తారో అక్కడే అభివృద్ధి కూడా పోటీ పడుతుంది.) ఉన్న సమయాన్ని కబుర్లతో  వృథాగా గడిపే  వారు, సోది అంటూ విషయాన్ని అర్థం చేసుకోలేని వారికి

ఈ విషయాలు వర్తించవు, రుచించవు కూడా.

Time is more precious than any other . Make each and every minute useful and meaningful.

ఇష్టమయినా కాకపోయినా కొన్ని కొన్నిసార్లు కాలంతోను, పరిసరాలు, పరిస్థితులతో రాజీ పడాల్సిందే.తప్పదు.

ఏం చేస్తాం చెప్పండి ? కూటి కోసం కోటి పాట్లు.

 

27 అక్టో, 2008

బస్సుపాలైన బాల్యం

paddu 1 060

కాళ్ళా గజ్జావయసు

కండెలమ్ముకుంటోంది

బలపం పట్టాల్సిన చేతులు

నాలుగు రాళ్ళ కోసం

తంటాలుపడ్తున్నాయి

కలలు కనే కళ్ళు

భవిష్యత్తును

కానలేకపోతున్నాయి.

లేలేత చెక్కిళ్లు

ఎండకు మగ్గిపోతున్నాయి

ఇంతమంది మధ్యలో

ఈ పెద్దమనిషి కూడా

పోటీ పడి మరీ

సంపాదించేయాలని

ఆరాటపడుతోంది.... !

....................పద్మకళ

రెక్కలు

GEETHA 080

నవ్వటం ఒక వరం

నవ్వలేకపోవటం జ్వరం

నవ్వు నటించటం కష్టం

నవ్వించగలగటం అదృష్టం

నవ్వి నొప్పించటం పాపం

నవ్వుల పాలు కావటం శాపం

............................... పద్మకళ.

21 అక్టో, 2008

బుజ్జి బొజ్జలకు బువ్వ

ఏమండోయ్ !

పెద్దలూ ! బాగున్నారా ?

ఏం చేస్తున్నారు ? మా సంగతి సరే, మీరేం చేస్తున్నారు ?

అంటూ మళ్ళీ మమ్మల్నే ప్రశ్నించడం మొదలుపెట్టారా ?

ఇదిగో కనిపిస్తున్నాం కదా !

బడి గంట ఒంటి గంట కొట్టింది,

మా బుజ్జి బొజ్జల్లో బుల్లి గంట మోగింది.

అందుకే వేడి వేడి అన్నంలో సాంబారు కలుపుకుని జుర్రుతున్నాం.

 

bangaaru talli 012bangaaru talli 011

ఇంతకీ ఏమిటీ  భోజనాల  బంతి ?

ఏమిటి విశేషం ? అనుకుంటున్నారా?

విశేషమే మరి. అక్టోబరు 13 నుండీ ప్రభుత్వం రాష్ట్రమంతా

హైస్కూల్లో కూడా మధ్యాహ్నభోజన  పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఇక మాస్కూల్లో కూడా అందుకోసం భారీగా సన్నాహాలు చేసి మా భోజనాల ఏర్పాటు చేసారు.

మీరు చూస్తున్న ఫోటోలు మా మొదటి మధ్యాహ్న భోజనాలప్పుడు మా టీచర్ తీసినవి.

మేమెలా ఉన్నాం ? బాగున్నామా ?

 

bangaaru talli 008bangaaru talli 014

 

ఇంతకీ భోజనాలు ఎలా ఉన్నాయనేనా మీ సందేహం ?

పర్లేదు. అన్నం సాంబారు.

రోజూ ఇదే మేత కావటంతో కొంచెం బోరు అనిపించినా ఇంటికెళ్ళాక మళ్ళీ అమ్మ చేతి వంట

మేస్తాం కాబట్టి ఓకే.

ఎన్నికల వల్లో, ప్రజాక్షేమమో , హాజరు పెంచడమో  ఏమో మాకయితే తెలియదు.

ఈ పథకం మాత్రం చాలా గొప్పదని అందరూ అంటున్నారు.

మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికెళ్ళి ,

గబగబా కుక్కుకుని పరుగెత్తి బడి గంట కొట్టేకంటే

ముందుపరుగెత్తే కంటే తాపీగా నాలుగుముద్దలు

తిని కడుపులో సాంబారు కదలకుండా పాఠాలు వినడం బాగుంది.

  bangaaru talli 010bangaaru talli 007

ఈ పథకం ఎంతకాలం సక్రమంగా సాగుతుందో ...

మధ్యదళారీలు, దురాశా పరులు చేరితే పిల్లలం అని కూడా ఆలోచించరని

మా కడుపు కొట్టేస్తారని ఎవరో అనుకుంటుంటే విని ఉలిక్కి పడ్డాం.

ఏ ప్రభుత్వమయినా పథకాలు ప్రవేశ పెట్ట గలదు కానీ

జనాల్లో చిత్తశుధ్ధిని ప్రవేశపెట్టలేదు కదా!

అందుకే మా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబువ్వ పథకం సజావుగా సాగాలని

కొంచెం పెద్ద మనసుతో దీవించరాదూ.....................................

12 అక్టో, 2008

జలజ జలవిహార వైభవం

 

                                     paddu10 069               

 

                      శ్రీ వైభవ లక్ష్మీ అవతారం                          

       పసిడి కాంతుల పాలవెల్లి, కరుణించి కాపాడే బంగారు తల్లి ,చల్లని చూపుల జాబిల్లి అమ్మలగన్నయమ్మ  విజయవాడ కనక దుర్గమ్మ   శరన్నవరాతృల సందడిలో ఆనందతాండవమాడింది.  నేల ఈనినట్లు  సుదూరతీరాలనుండి అశేష భక్తజనులు తరలి వచ్చి గంటలకొద్దీ  బారులు తీరి, వేచి వేచి ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా దర్శించి తరించారు.

కోరిన కోర్కెలు తీర్చే ఆ తల్లికి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

                బుజ్జి111 066

                         కనక దుర్గమ్మ

                            పొంగిపొరలే భక్తి ప్రవాహాన్ని, భక్తజన సందోహాన్ని ఏమాత్రం నిరాశపెట్టకుండా  రోజంతా ఆ జగదాంబ చెదరని చిరునవ్వుతో అందరినీ పలకరించింది. తన భక్తుల కోసం నవరాతృలూ నిద్ర లేకుండా గడిపింది.

                           రోజు రోజుకీ కొత్త కొత్త అలంకారాలు, వేలాది మంది భక్తులు సమర్పించుకొన్న పూలమాలలు, రత్న, మాణిక్య , వజ్ర, వైఢూర్యాది ఆభరణాలతో కన్నులపండువ చేసి ఆమె మాత్రం ఆ భారం మోసి మోసి అలసిపోయింది. ఇంతా చూస్తున్న  ఆమె నెచ్చెలి కృష్ణమ్మ ఉండబట్టలేక పోయింది.కొండపై నున్న ఆ మహారాణిని  ఈ అలివేణి  కృష్ణవేణి చేతులు చాచి సాదరంగా తన ముంగిట్లోకి ఆహ్వానించింది.

                          ఈయమ్మ ఆహ్వానాన్ని మన్నించి ఆయమ్మ రాజరాజేశ్వరిగా రాజసంతో సకలపరివారంతో భక్తజనావళి జేజేల మధ్య కొండదిగి వచ్చింది. కృష్ణవేణీ జలాలతో జలకాలాడి కృష్ణా తరంగాలపై  స్వైరవిహారం చేసింది.

                          ఎప్పుడూ తనను చూడడానికి తరలి వచ్చే వేలాదిమంది భక్తుల ముందుకు వచ్చి నగరంలో పర్యటించి, నదీతీరంలో  సేదతీరింది.

                                కృష్ణా నదిపై జలవిహారం చేస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ

                 అసంఖ్యాకమైన ప్రజానీకం ఆ అంబ జలవిహారాన్ని కన్నులారా చూడాలని తరలి వచ్చింది. అయినా ఎక్కడా సడి లేదు.కృష్ణాతరంగాల సవ్వడులు తప్ప.ఆ సన్నివేశపు శోభ అత్యధ్భుతం.అందరి కళ్ళూ రెప్పవాల్చకుండా హంస వాహనంపై బంగారు సింహాసనంపై విరాజితురాలై మందహాసం చేస్తున్న ఆ తల్లి ముఖబింబం పైనే.

                                                           బుజ్జి111 134

          హంస వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి సమేత దుర్గాభవాని అమ్మవారు

                 హంస గమన  గజగమన, మందగమన గా పేరుగన్న అమ్మవారి నడకలు హంసను అధిరోహించడంలోని ఆంతర్యం లోకక్షేమం కోసం హింసను జయించి  దుష్ట శిక్షణ ద్వారా శాంతిని నెలకొల్పి అహింసా తత్వాన్ని బోధించడమే అంటూ అర్చకస్వాములవారిఅమృతవాక్కులు ఇంద్రకీలాద్రి ప్రాంతం ,కృష్ణాతీరమంతా మారుమ్రోగిపోయాయి.

                               బుజ్జి111 127

 

             హంస వాహనంపై విహరిస్తున్న హంసగమన హరుని మనోహరి

                             విశ్వశ్రేయస్సుకై చెడును అంతం చేసే మహంకాళికి మహిషాసురమర్దినంలో కలిగిన క్రోథాన్ని కృష్ణమ్మ తన చల్లని జలాలాతో చల్లార్చింది. ఇష్టకామేశ్వరిగా కోరిన కోర్కెలు ఈడేర్చే ఆ తల్లి భవాని మాలధారుల దీక్ష,దక్షతలను చూసి పులకించి పోయింది. ఎటుచూసినా ఎర్రదనం ధైర్యానికి ,సౌభాగ్యానికి ప్రతీకగా దర్శనమిచ్చింది.

                                                         paddu10 062

                                                                                                   

     

                              108 శక్తి క్షేత్రాలలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ క్షేత్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యతీర్థంలో  కృష్ణమ్మ ఆతిథ్యం స్వీకరించి ఆమె ఒడిలో సేద తీరుతూ అన్నపూర్ణమ్మ అడిగింది  ఇలాగే నిత్యమూ పరవళ్ళుతొక్కుతూ నిండుగా ప్రవహిస్తూ బిడ్డలకి ఆకలి బాధ లేకుండా చేయమనీ అనునిత్యం ప్రాణదానం చేయమనీ. అందుకు కృష్ణమ్మ సరేనంది.

                                                        paddu10 060

 

                                ’కృష్ణా జలాలు అమృతప్రాయంగా పారి, విస్తారంగా పంటలు పండాలి. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. ఏ పొరపొచ్చాలు లేకుండా ఉత్సవాల పేరిట తన దర్శనానికి వచ్చి సంఘటితం కావాలి. పేదా గొప్పా భేదాలు మరచి తన నట్టింట్లో సహ పంక్తి భోజనాలు చేయాలి.’ ఏడాదిపాటు ఎడబాటులో ఉన్న ఆ నారీ మణులు ఇలా ఓ గంటపాటు ముచ్చట్లాడుకున్నారు.కృష్ణమ్మ ,దుర్గమ్మ చెట్టపట్టాలేసుకుని ఆడిపాడి పరవశించారు.

                            వెంటపడుతున్న ప్రజాప్రతినిధులు ,ప్రముఖులు,మీడియా వారి నుండి తప్పించుకుంటూ హంస తన గమనాన్ని, వేగాన్ని మారుస్తూనే ఉంది.అయినా వాళ్లు వదల్లేదు. మళ్ళీ ఆ అవకాశం రావాలంటే ఇంకో వసంతం దాటాలికదా! అందుకే వెంటపడ్తూనే ఉన్నారు. ఆ అధ్భుత  దృశ్యాలని ఆగిపోయినవారి కోసం వివిధ కారణాల వల్ల  అక్కడికి చేరుకోలేక పోయిన వారికోసం

తమ కెమెరాలలో బంధిస్తూనే ఉన్నారు. 

                          

    

                         

                          

 

                                                                      

                                                  

 

 

 

 

 

                                

 

                     

7 అక్టో, 2008

విధి - మన విధి

చూపులేని కన్నులు

ఏమీ చూడలేక రోదిస్తూంటే

చూసీ ఆగలేని కన్నులు

వేధిస్తున్నాయి

చూసిందల్లా కావాలని..............

నడవలేని కాళ్ళు

తమంత తాముగా

అడుగులో అడుగేసి

ముందడుగుకై తపిస్తోంటే

నడక నేర్చిన కాళ్ళు

పెడదారుల్లో పరుగెడుతున్నాయి

చిక్కిందల్లా దక్కించుకోవాలని

చేజిక్కించుకోవాలని.................

మాటరాని నాలుక

మదిలో ఉప్పొంగే భావ పరంపరను

మౌనంగా దిగమింగేస్తుంటే

మాటకారి నాలుక

మందిని-పది మందినీ

ఆడిపోసుకొంటోంది......................................

వినికిడి లేని చెవులు

పెదాల నాట్యాలను

పదాలుగా అనువదించుకుంటుంటే

వినేవాడి చెవులు

రోజంతా వినేది,

వినాలనుకునేది వినకూడనిదే........................

ఆపదలో ఉన్న చేయి

ఆధారం కోసం

ఆశగా ఎదురు చూస్తుంటే

అందీయవలసిన చేయి

అహంకారపు

హృదయ పీఠంపైనే

ఆగిపోయి నేను - నాది

అంటూ స్వార్థపు చాలనాలు చేస్తూ

తప్పించుకు తిరుగుతోంది....................................

నిర్విరామ జీవన పయనంలో

అలుపెరుగని మన నూరేళ్ల పోరాటంలో

అస్త్రాలు లేని ఈ సైనికులని

మన ఆదరణే అండగా

ప్రోత్సాహమే ఆయుధంగా

చేయూత నిస్తూ, సహకరిస్తూ

ఆ నిండుగుండెలని మనతో

కలుపుకొని మునుముందుకు సాగి

విధి ని ఎదురొడ్డి

మన విధిని నెరవేర్చ లేమా ?................

విధాత మెప్పు పొందగ లేమా ?.........

జగజ్జేతలం కాలేమా. ?.............

........

ఎలా తెలుపను?..... (కథ)

తెల్లవారే ముందు చిమ్మ చీకట్లో నుండి పొడుచుకు వచ్చిన సూర్య కిరణంలాగా మారైలు పండువెన్నెల్లో దారానికి పూలు గుచ్చుతున్నట్లుగా ఊళ్ళన్నిటినీ కలుపుకుంటూ దూసుకెళ్తోంది.అంతా గందరగోళం. ఎవరిగోల వారిది . ఇది ఏ సినిమాకీ టైటిలు కాదు. నే ప్రయాణిస్తున్న రైలులోని పరిస్థితి. వినేవాళ్ళు నలుగురైతే చెప్పే వాళ్ళు ఆరుగురు. ఎవరు చెబుతున్నారో ఎవరు వింటున్నారో చెప్పలేనంత గట్టిగా అరుచుకుంటున్నారు జనం. అదేలెండి మాట్లాడుకుంటున్నారు. గలగలా మాట్లాడటమన్నా , అలా మాట్లాడే వాళ్ళన్నా నాకు ఇష్టమే. కానీ రోజుకు ముగింపు చెప్పే రాత్రి సమయాల్లో మాత్రం నేను ఒంటరితనాన్నే ప్రేమిస్తాను.రోజంతా నేను చేసిన పనులను ప్రశ్నించుకుంటూ మరుసటి రోజుకోసం ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకోవటం నాకు చిన్నప్పటి నుండీ అలవాటు. పరుగుపందెంలో నేనే గెలవాలంటూ పోటీ పడే ఆటగాళ్ళలాగా చెట్లన్నీ పరుగెడుతున్నాయి. కానీ ఒక్కటే తేడా. అవి వెనక్కి పోతున్నాయి. ప్రకృతి ప్రేమికుడినైన నేను అందమైన దృశ్యాలు ఆస్వాదిద్దామంటే చుట్టూ ఉన్న మాటలు ఆటంకపరుస్తున్నాయి. ఇక ఉండబట్టలేక అలా ముందుకు నడిచి రైలు గుమ్మంలోకి చేరాను. అక్కడే కూర్చుని ప్రకృతిని చూస్తూ ప్రశాంతంగా గడపాలనిపించింది నాకు. కళ్ళముందు కంటికి ఇంపైన దృశ్యాలు ఎన్నో... విశ్రాంతి తీసుకుంటున్న పశువులు, చెట్టు చేమలు. నిశ్శబ్దంగా ఉన్న ఊళ్ళమధ్య నుంచి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ నేనూ, మారైలూ... వాళ్ళలో చాలా మంది నిద్రకు భంగం కలిగిస్తూనే ఉన్నాం.అయినా ఏమీ చేయలేని , ఉన్న గూడు వదిలిపోని జీవితాలు వాళ్ళవి. అందుకే ఏమీ పట్టనట్టు నిద్రపోతూ , నిద్రపోవటానికి ప్ర్రయత్నిస్తూ నా కళ్ళల్లో పడ్డారు. చంద్రుణ్ణి చూసి విచ్చుకున్న కలువలు, పూరిళ్ళ ముంగిళ్ళలోని జాజిపూల పందెళ్ళ నుండి సువాసనలు మెల్లగా నా దాకా చేరి ఒక్క నిముషం మా ఊరిని గుర్తుకు తెస్తుంటే ... ఆ ఆలోచనలు మెల్లగా మా ఇంటికి పరుగులు తీసాయి. రైలు చక్రాలకంటే వేగంగా. అలా వెళ్ళి వెళ్ళి, .. ’అందర్నీ పలకరించాలి ’ అనుకుంటూ ఇంటికెళ్ళి పోయినట్టూ , అమ్మా! నాన్నా! అంటూ వాళ్ళని తలుపు తట్టి పిలుస్తున్నట్లు అనిపించింది. వెంటనే అనుకున్నాను. " ఈ టైమ్ లో వాళ్ళు నిద్రపోతారేమో కదా ! "అని.అలా అనుకుంటూనే నేనూ మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నానని, ముందుకు తూలుతున్నానని తెలియనే లేదు. వేగంగా పరుగెత్తే రైలులోంచి విసిరేసినట్టు నేను క్రింద పడేదాకా. పడటం పడటం ముళ్ళ కంపలు, రాళ్ళ గుట్టలు కలిసి కట్టుకున్న గూటిలో పడ్డానేమో.. ఒక దానితో ఒకటి పోటీ పడి మరీ అవి నన్ను గాయపర్చాయి. అంత డబ్బు పెట్తి కొన్న టిక్కెట్తు నా జేబులోనే ఉన్నా నన్నెక్కించుకున్న రైలు మాత్రం నన్ననాథని నేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం స్టాప్.. స్టాప్.. అంటూ నన్ను పట్టించుకోకుండా పారిపోయే రైలుని పొలికేకలతో పిలుస్తూనే ఉన్నాను. గొంతు బొంగురుపోతోంది. నా పిలుపు వినబడేటంత దూరంలో చెట్టు చేమలు, చందమామ తప్ప మనుశులెవ్వరూ కనబడట్లేదు. అప్పటి దాకా ఎంతో అందంగా కనిపించిన చందమామ, చెట్లు, ప్రకృతి నన్ను చూసి ఏమీ చేయలేకపోయేసరికి నాకవి బద్ధ శతృవుల్లాగా కనిపించాయి.

దేవుడా ! ఏమి గతి? ఒళ్ళంతా గాయాలు కదలలేని నన్ను చూస్తే నీకు జాలి కల్గటం లేదా?అని పైకి ఏడుస్తున్నా మనసులో ఇంకేదో భయం. ఏపామో , పురుగో పుట్రో వస్తే ? ...అమ్మో! తలచుకుంటేనే పై ప్రాణాలు పైనే పోతున్నట్లిపించింది. ఇక లాభంలేదు. నాకు నేనే సాయం చేసుకోవాలి అనుకున్నాను. నెమ్మదిగా ఓపిక చేసుకుని సెల్ ఫోన్ కోసం జేబులన్నీ వెదికాను. ఎవరికి ఫోన్ చెయ్యాలి? ఎంత అర్థరాత్రి వేళ ఎవరు వస్తారు? ఎలా వస్తారు? వచ్చినా ఎప్పటికి వస్తారు? తెల్లారిపోతుందేమో! అంతదాకా నాప్రాణాలు ఆగుతాయా? ప్రక్కనెవరైనా తోడుంటే ఎంత బాగుండేది? అంతమంది మనుషులు చుట్టూ ఉన్నప్పుడు విసుక్కుని ఒంటరి తనం కోరుకున్నందుకా ఈ శిక్ష? ఏమో! ఏమైనా సరే ! వెంటనే ఇక్కడి నుంచి బైట పడాలి.ఒళ్ళు బరువెక్కుతున్నది అసలింతకీ ఎక్కడున్నానో ? అనుకుంటుంటే ’వెంట్రప్రగడ ’ అన్న ఊరు పేరు చూపించింది నా సెల్. ఒక్క సారిగా సెల్ ఫోన్ ని నా గుండెలకి హత్తుకున్నాను. బండినిండా ఉన్న అంతమంది జనం నన్ను పట్తించుకోకపోయినా విశ్వాసంతొ నా వెంటే ఉండి నాకు దారి చూపించావు " అనుకుంటూ ఎవరికి ఫోన్ చెయ్యాలా ? అని ఆలోచించటం మొదలు పెట్టాను. వెంటనే గుర్తుకొచ్చింది. మూడంకెల నంబరు 108. వాళ్ళు రావడానికి ఇటు రోడ్దు మార్గం ఉందో లేదో అయినా ప్రయత్నిస్తే తప్పే,ముంది? అనుకుంటూ డయల్ చేస్తే హైద్రాబాద్ 108 కాల్ సెంటర్ కి చేరింది నా కాల్. వాళ్ళ గొంతు వినగానే నాలో కొండంత ధైర్యం పుంజుకుంది.ఓ ఆశ పుట్తింది , వాళ్ళు వస్తారని, నన్ను బతికిస్తారే,మోనని. bangaaru talli 003 నా ఆశకి ఊపిరిపోస్తూ అటువైపునుండి మాటలు అమృత వర్షం లా. "మీరేం భయపడకండి. మీరు చెప్పిన వివరాలతో వీలైనంత త్వరగా మా సిబ్బంది మిమ్మల్ని చేరుకుంటారు. ధైర్యంగా ఉండండి. ఫోన్ ఆన్ చేసే ఉంచండి. అవసరమైతే మేమే మీకు మళ్ళి కాల్ చేస్తాం. ఆ మాటలు ఇంకా ఇంకా విన్పిస్తున్నట్లు ఉండగా నాకు తెలియకుండానే అలా ఒరిగిపోయాను. ఇక ఆపై ఏం జరిగిందో నాకు తెలియదు. నేను స్పృహకోల్పోయాను.
స్పృహ వచ్చేసరికి కళ్ళపై నీరెండ. నే ను గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో ఒళ్ళు కనిపించని కట్ల మధ్య ఇరుక్కున్నాను. గడియారం తొమ్మిది గంటల నలభై మూడు నిముషాలు చూపిస్తోంది. నా కళ్ళను నేనే నమ్మ లేకపోయాను. ఒకసారి ఫోన్ కావాలని అడిగితే చేతికిచ్చారు. ఎంతో కశ్టపడి అందులో చూస్తే 15మిస్డ్ కాల్స్ కనిపించాయి 108 వాళ్లవి. నేను డయల్ చేసిన ఫోన్ కాల్ రాత్రి ఒంటిగంటా నాల్గు నిముషలకని కనిపించింది. నాఫోన్లో. అడవిలాంటి ఆప్రాంతం నుండి ఇక్కడికెలా వచ్చాను? ప్రాణాలపై ఆశవదులుకున్న నేను ఎలా ప్రాణం పోసుకున్నాను? ఒక దానిపై ఒకటిగా ప్రశ్నలు వేయసాగాను. వెంటనే ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. తెల్లవారు ఝామున ౩ గంటల ప్రాంతంలో ౧౦౮ సిబ్బంది నన్ను హాస్పిటల్ కి చేర్చి, నా ప్రాణాలకి ముప్పులేదని తెలుసుకుని వెళ్ళారని. నేను నా జీవితంలో మర్చిపోలేని ఇంకొక విషయంకూడా చెప్పారు. గుడివాడ నుండి బయల్దేరిన అంబులెన్స్ వెంట ప్రగడ సమీపంలో ఆపి, దాదాపు 4 కి.మీ.దూరం వరకు పట్టాలపై టార్చి సహాయంతో వెతుక్కుంటు వచ్చి దిక్కు లేకుండా పడిఉన్న నన్ను స్ట్రెచర్ పై వేసుకుని అంతదూరం నన్ను మోసుకుని వైద్యం కోసం ఇక్కడికి తరలించారని, ఆ సన్ని వేశాన్ని ఊహించుకుంటేనే కళ్ళనీళ్ళు ప్రవాహాలవుతున్నాయి. అన్ని సార్లు వాళ్ళు ఫోన్ చేసినా నాకు తెలియనే లెదు. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినందుకు ’ చనిపోయుంటాడులే. చీకట్లో ఎక్కడని వెదుకుతాం ? రేపు వచ్చి చూద్దాం ! " అనుకుని వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళి పోతే నా గతి ఏమయ్యేది? దేవుడా ! కష్టాలొచ్చినప్పుడు నువ్వులేవనుకుంటాం మేము. కానీ ఇలాంటి గొప్ప సేవకుల రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడతావని కల్లోకూడా అనుకోలేదు. ఏంఛేసి వాళ్ళకి కృతఙ్ఞతలు చాటుకోవాలి? నెలరోజులపాటౌ బెడ్ పై నున్న నన్ను ఎంతమంది చుట్టాలొచ్చి పలకరించినా వాళ్ళలో ఎవరూ నాకు ఆప్తుల్లాగా కన్పించలెదు. పైపై పలకరింపులకి పైపై సమాధానాలిచ్చి వాళ్లని పంపించేసే వాడిని. ఎపుడెపుడు నడవగలుగుతానా? అని ప్రతిక్షణం మథనపడుతూ రోజూ అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళి అడుగుతున్నాఅను డాక్టర్ని . సర్ ! ఇంకెన్ని రోజులు పడుతుంది? నేను మామూలు గా నడిచి బయటికెళ్ళటానికి? నెను వెంటనే నా ప్రాణ దాతల్ని చూడాలి. కృతఙ్ఞతల్ని చెప్పాలి.అంటుంటే విచ్చుకున్న డాక్టరు పెదాలిచ్చే సమధానం: "రమేష్ గారూ! మీరు 50 వ సారి అడిగిన ఒకే ప్రశ్నకు నా 50 వ సమాధానం ! ఇంకో ఐదారు రోజుల్లోనే. సరేనా? ప్రశాంతంగా పడుకుని విశ్రాంతి తీసుకోండి". డాక్టర్ గారెళ్ళి పోయారు. మళ్ళి నాలో ప్రశ్న మొదలైంది. ఐదు రోజులు అంటే ఈ రోజు మంగళ వారం, రేపు బుధ, గురు, శుక్ర,శని వారం ..... హమ్మయ్య.... ఆది వారం ...... త్వరగా వచ్చేస్తే బావుణ్ణు. వెంటనే వెళ్తాను. 108 ఆఫీసుపై వాలతాను. వాళ్ళు పెట్టిన ప్రాణ భిక్షతో వారి కళ్ళ ముందు కనిపిస్తాను. నా కృతఙ్ఞత చాటుకుంటాను.
bangaaru talli 005

లచ్చిమి చెప్పారు...

౧౦౮ వారి సేవా తత్పరత కి జోహారులు దైవం మానవ రూపం లో అని అనొచ్చేమో వీరి గురించి చెప్పాలంటే కాని కొంత మంది ఆకతాయిలు వీరిని కూడా వదలటం లేదు. అల్లరితనం తో వీరిని ఆటపట్టిస్తున్నాం అనుకుంటూ బాధపెడుతున్నారు అట్లాంటి వారు అల్లరి వీడి ౧౦౮ వారికి సహకరిస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు కులాసాయేనా

3:41 AM
లచ్చిమి చెప్పారు...

౧౦౮ వారి సేవా తత్పరత కి జోహారులు దైవం మానవ రూపం లో అని అనొచ్చేమో వీరి గురించి చెప్పాలంటే కాని కొంత మంది ఆకతాయిలు వీరిని కూడా వదలటం లేదు. అల్లరితనం తో వీరిని ఆటపట్టిస్తున్నాం అనుకుంటూ బాధపెడుతున్నారు అట్లాంటి వారు అల్లరి వీడి ౧౦౮ వారికి సహకరిస్తే బాగుంటుంది ఇప్పుడు మీరు కులాసాయేనా

3:41 AM
చక్రవర్తి చెప్పారు...

కధా కధనం చాలా బాగుంది. కాకపోతే ఒక చిన్న సలహా. వ్రాసే మధ్యలో చిన్న చిన్న విరామాలు ఇవ్వండి. అలాగే పేరాలు పేరాలుగా వ్రాయండి. కొంచం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే వీలైతే ౧౦౮ యాజమాన్యం అనుమతితో ఇలాంటి గొప్ప వ్యక్తుల ముఖ చిత్రాలు ప్రచురించడానికి ప్రయత్నించండి. ఎంతైనా మన కధలో వీళ్ళే హీరోలు హీరోయిన్లు కదా.

9:10 AM
rani చెప్పారు...

touching! may god bless those 108 people!

9:30 AM
telugukala చెప్పారు...

లచ్చిమి గారూ ! నేను పద్మకళ ని. వివరాలు పొంది కథ రచించాను.మీ ప్రశ్న కు సమాధానం: ఆ వ్యక్తి (కథలోని రమేశ్ )ఇప్పుడు కుశలంగానే ఉన్నారు.

12:00 PM
Rajesh చెప్పారు...

ప్రారంభం చాల బావుంది (అదిరింది అనుకోండి). చక్రవర్తి గారి సలహాయే నాది కూడాను. 108 కు క్రుతజ్నతాభినందనలు

8:14 AM
nandayarrachowdu చెప్పారు...

మీ కథ,కథనం బాగుందండి,అలాగే 108కి కృతజ్ఙతలు.

1:32 AM
shake చెప్పారు...

ప్రజాసేవలో నూటఎనిమిది మరింత ప్రగతిపథంలో దూసుకెళ్ళాలని ఆశిద్దాం. కథ బాగుంది.

9:18 PM

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Links to this post

లింక్‌ను సృష్టించు

క్రొత్త పోస్ట్ పాత పోస్ట్ హోమ్

దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

5 అక్టో, 2008

౧౦౮ కథలు-

చిటికెటంత పనిచేసి చప్పట్ల కోసం ఎదురుచూస్తున్న మనుషులున్న కాలం ఇది. ప్రతి రోజూ సేవల పేరు మీదో ,పరోపకారం ముసుగులోనో స్వామికార్యం ,స్వకార్యం అన్నట్లుగా చిన్న చిన్న పనులు చేసి వాటిని ఘనకార్యాలుగా ముస్తాబు చేసి వాళ్ళ కీర్తి కిరీటాలలో ఆ మణుల్ని చేర్చుకొని మురిసి పోతూ ఉంటారు.

నిజానికి అలాంటి వాళ్ళు చేసిన ఘనకార్యాలు మహత్కార్యాలు మాత్రం కావని వాళ్ళతో పాటు మనకీ తెలుసు. కానీ మనకి తెలిసో తెలియకో లేక తప్పకో వారిని మునగ చెట్టు ఎక్కించి ఆహా!ఓహో ! అంటాం.వాళ్ళ దాకా ఎందుకు ? ఎదుటివాళ్ళ మెచ్చుకోలు కోసం ప్రతీ క్షణం ఆరాటపడేవాళ్ళు మనలో కూడా చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో!

కానీ ప్రశంసలకీ,ప్రయోజనాలకి దూరంగా ఉంటూ విధి నిర్వహణే ప్రాణంగా వారి వ్యక్తిగత జీవితాన్ని సైతం మానవత్వానికే ధార పోస్తున్న వారు నూట ఎనిమిది సిబ్బంది.(౧౦౮) పగలు-రాత్రి,ఎండ-వాన ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పిలుపు కే పలికి,పరుగులు తీస్తూ వచ్చి, "మీ కోసం మేమున్నామంటూ ఆఘమేఘాల మీద చేరుకొని,ప్రాణాలను నిలబెట్టే సైన్యం ౧౦౮.

దేవుడిచ్చిన ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టడం కోసం వీరు పడే తపన ,ఆవేదన చూస్తే ఆ దేవుడు కూడా శిరసు వంచి సలాం కొట్టాల్సిందే.

ఆ పత్కాలంలో ఆదుకున్న వీరిలోనే దేవుణ్ణి చూసుకుంటారు ప్రాణ భిక్ష పొందిన వాళ్ళు.వీరు మాత్రమ్ బాధితుల ఊరట చూసి "హమ్మయ్య ! ఓ ప్రాణం నిలబెట్టగలిగాం" అనుకుంటూ ఊపిరి పీల్చుకుని, ఓ చిరునవ్వు చిందిస్తారు.

వీరి సేవలకి మనకి తెలిసిన ఉన్న అవార్డులు చాలవు.నిత్యమూ వేలాది ప్రాణాలు వీరి చేతిలో పునర్జన్మ పొందుతున్నాయి. సమాజం కోసం వీరింత శ్రమిస్తూ సేవ చేస్తున్నపుడు కృతజ్నత చెప్పాల్సిన కనీస ధర్మం మనకి ఉంది కదా!

దాదాపు నాలుగు నెలల పాటు నూట ఎనిమిది సేవల విధానాలు, సిబ్బంది పనితీరు గమనించి , వారి అనుభవాలు, ఇబ్బందులు తెలుసుకొని, లబ్ధిదారులు కొందరిని ప్రత్యక్షంగా కలిసి, వారి అభిప్రాయాలు పంచుకొన్న తరువాత వారిపై , వారి సేవా నిరతి పై నాకు కలిగిన అచంచల మైన గౌరవ భావాన్ని, మీతో పంచుకోవాలనిపించింది.

అందుకే ఆ లక్ష్యంతోనే వారు నిలబెట్టిన ప్రాణాల కథలకి అక్షర రూపం తెచ్చి, అందరి హౄదయాలలోనూ ఆ రూపాలకి చోటు కల్పించాలని చేసే చిరు ప్రయత్నమే ఈ

నూట ఎనిమిది కథలు............ఇవి ముమ్మాటికీ నిజాలు.

(pl..గో to next పోస్ట్........)

2 అక్టో, 2008

ప్రాణ దాతలకి ప్రణామాలు.

అలుపు -అరమరిక ,విసుగు _విశ్రాంతి పదాల అర్థం తెలియని సేవా తత్పరులు ౧౦౮ (నూట ఎనిమిది )సిబ్బంది .గడియారమైనా అప్పడప్పుడు ప్రశాంతంగా ఆగి సేద తీరుతుందేమోగాని వీరు మాత్రం కాలంతో పోటీ పడి పరుగులు తీస్తూనే ఉంటారు. ప్రతి క్షణం ఏ కాలుడి తో పోరాటం చేస్తూనే ఉంటారు.

మీకు తెలుసా ? ఈ మధ్య రెండు ప్రాణాలు కృష్ణా జిల్లా ౧౦౮ అంబులెన్స్ లోనే ప్రాణం పోసుకున్నాయని?

ఈ రెండు వార్తలు విన్నప్పటి నుండీ అంబులెన్స్ కనపడగానే సలాం కొట్టాలనిపిస్తుంది.

నా సలాంకి ఇంకా మానవతావాదులు ఎవరైనా కలిసి బలమిస్తారని ఆశిస్తూ ఈ కవితని వారికి అంకితం చేస్తున్నాను....................

౧౦౮.మీ నేస్తం

కనిపించే చైతన్యం

అలుపెరుగనిదీ సైన్యం

నడిపించే నేతృత్వం

స్వార్థానికి బహుదూరం

ప్రజాసేవ మా పరమార్థం

ప్రాణ రక్షణ మాతక్షణ కర్తవ్యం !

అమూల్యం ప్రతిక్షణం

ఆపదలో మీరున్న క్షణం

బంధువుల మై మేమున్నాం

బాసటగా నిలుస్తాం !

గాలివాటున మీ పిలుపందుకుంటాం

సుడిగాలిలా మీ కడకు చేరుకుంటాం !

మమ్మల్నే మరుస్తాం

మీ కోసం శ్రమిస్తాం

ధైర్యానికి సారధులం

సహనానికి వారధులం

నూట ఎనిమిది మా పేరు

నమ్మకానికి మారు పేరు !

మీ రక్షణ కే ఈ నంబరు ! ................. 108 bangaaru talli 002

మా ప్రాణాలకు భరోసా మీరు !

మీ సేవా తత్పరతకిదే మా జోహారు ........... పద్మకళ