నింగి విరిగి నేల కూలినా....పుడమి గుండె బద్ధలై గగనానికి ఎగసినా....సూర్య చంద్రులు తారుమారైనా .... ’సత్య’మే గెలుస్తుంది . ఎప్పటికైనా !
అసత్యం అప్పుడప్పుడూ విర్రవీగినా , అధర్మం చెలరేగినా అది తాత్కాలికమే.
పరిణామం........ ప్రతి ఒక్కరు ఇష్టపడేది, ఆశపడేది. ఉన్న స్థితి నుంచి మార్పు కావాలని , అడుగడుగునా అభివృద్ధి చెందుతూ ఆకాశమే హద్దుగా ఎదగాలని కలలు కనని వాడు మనిషే కాడు. కాకపోతే తన ఎదుగుదల కోసం ఇతరులను అణగద్రొక్కే దుర్మార్గులు కొందరు, నలుగురికోసం తమని తాము అర్పించుకుంటూ ఒదిగి ఎదుగుతూ అందరి మదుల్లో గది కట్టుకునే వాళ్ళు కొందరు.
మార్పు రావాలంటూ నినదిస్తున్న మహానుభావులందరికీ మార్పు ఎంత తీవ్రం గా కూడా ఉంటుందో ,దాని పర్యవసానాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చూపించాడు ఓ సత్యవంతుడు.
అవును అబద్ధం చెప్పానని స్వయంగా ఒప్పుకున్నా ప్రపంచం అతన్ని సత్యవంతునిగానే చూస్తుంది.
వ్యాపారంలో అబద్ధం చెప్పని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులు మాత్రం కాదు.దేవతలో....
"పులినోట్లో చిక్క కుండా దాని పై స్వారీ చెయ్యటం ఎంతో గొప్ప సాహసం" అంటూ సాహసాన్ని చేసి పులి బారినుంచి ఈ రాజు తప్పించుకున్నా పులిని మించిన వింత జీవి ఆయన్ను కప్పివేయటం తెలుగు ప్రజలకి తీరని దుఃఖానికి గురిచేసింది.
ఎవరి నోట విన్నా ఒకటే మాట. ఈ రాజు మారాజు, మంచి రాజు, మనసున్న మారాజు. అని.
వనవిహారమైనా , కారాగారమైనా సింహం సింహమే.కాకపోతే ఈ సింహం గర్జించదు. మౌనంగా ప్రపంచాన్ని జయిస్తుంది.
గెలిచిన వాడి కంటే ఓ డిన వాడికి కసి ఎక్కువ అన్నట్టు . దెబ్బతిన్న పులి మళ్ళీ విజృంభించక మానదు.
పుట్టిన గడ్డ నుంచి ప్రపంచం దాకా ఎదిగి పేరు తెచ్చుకునే వారు కొందరైతే ఆ గడ్డకే పేరు తెచ్చే ప్రతిభామూర్తులు కొందరే.
విశ్వవీధిలో సాంకేతికతా సామ్రాజ్యంలో ఓ సాధారణ తెలుగువాడు జయపతాకమెగరేసిన నాడు ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టాం. దారి గానక కూల బడిన ఓ దివ్య మూర్తిని దీనంగా చూస్తూ నిట్టూరుస్తున్నాం.
జైలు కెళ్ళటం మహనీయులకి కొత్తేమీ కాదు. బాపూజీ, శాస్త్రీజీ, పటేల్జీ, తిలక్..... ఎందరో . కల్మషం, కాఠిన్యం , రక్తపాతం, దుర్మార్గం అంటుకున్న జైలు గోడలని ఆవిరైపోతున్న కన్నీటి చుక్కలతో కడిగి, సంక్రాంతికి స్వచ్చమైన చూపుల తోరణాలు కట్టేందుకే ఈ పరిణామం....
కాకపోతే ఈ పరిణామం కొత్త సంవత్సరంలో మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయి బాధించటం నిజంగా బాధాకరం.పట్టాఅభిషేకాన్నీ, వనవాసాన్నీఒకేలా గా స్వీకరించి ఆరాముడు స్థితప్రఙ్ఞుడైతే , గెలుపునీ , ఓటమినీ సవినయంగా స్వీకరించిన ఈ రాముడూ చారిత్రక పురుషుడే.
వేలాది మందికి అన్నదానం , ప్రాణదానం చేస్తూ దేవుడైన మహనీయుడికి ఈ పరిస్థితి ఏమిటాని సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. గ్రహణం పట్టినంత మాత్రాన సూర్య చంద్రులు లోక రక్షకులు కాకపోరు.
ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు తింటున్న మేరు నగాలు ఎన్నో ఏళ్ళ తరబడి సముద్రుణ్ణి చూస్తూ , చిరుమందహాసం చేస్తూ , ధీమాగా నిలబడి ఉండగా లేనిది..............
కళ్ళు తెరిచింది మొదలు, మూసే వరకు జనాల్ని పీడించుకు తినే జలగలు, అమాయకులని జీవచ్చవాలని చేసి పీక్కు తింటున్న రాబందులు యధేచ్చగా విర్రావీగగాలేనిది:
బైర్ర్రజుగా రామ రాజ్యం కోసం తపించి , లక్షలాది మంది గుండేల్లో గుడికట్టుకున్న మారాజువి....... అధర్మంతో పోటీ పడి తాండవమాడలేని అపర శివుడివి.........
చెయ్యి తడపందే కాలు కదపని సోమరిపోతు లంచగొండి శునకరాజాలు, ఆత్మ పరిశీలనకు అర్థం తెలియని భేషజాల బడా బాబులు, స్వేచ్చగా , యధేచ్చగా జైత్రయాత్రలు సాగిస్తుంటే గుండెపై చెయ్యి వేసి , కళ్లతో బదులివ్వగల ధీమంతుడివి, సహనశీలివి.
అశ్వత్థామ హతః - కుంజరః అని నిజమైన అబద్దాన్ని చెప్పిన యుధిష్టురుడు ధర్మరాజైతే.....
గోవర్థనగిరినెత్తి తనవారిని కాచిన కృష్ణుడు దేవుడైతే , నమ్ముకున్న వేలాదిమంది భవితవ్యం కోసం నీ పరువునే ఛత్రంగా చేసి తల క్రిందులైనా , తిరగబడినా ఏళ్ల తరబడి కునుకులేకుండా పోరాడి గెల్చుకున్న కీర్తి ప్రతిష్ఠల్ని, సంపదల్ని పణంగా పెట్టి నీ వారి కోసం ,నిన్ను విశ్వసించిన సంస్థ కోసం గొడుగుపట్టిన సత్యమూ దైవమే.
నిజం నిప్పులాంటిదైనా మనిషిని మనిషిగా నిలబెడుతుంది.......ఒక్కోసారి దేవుణ్ణి కూడా చేస్తుంది..
నాకు తెలిసిన ప్రపంచం చిన్నదే కావచ్చు.
నా అనుభవానికి వయసే లేకపోనూ వచ్చు.
మౌనంగా నా భావాలను పంచుకొని, చల్లగా జారుకోకుండా
మీ అభిప్రాయాన్నిచిరు వ్యాఖ్యలతో ఆవిష్కరించండి.
ఏది సత్యమో ..... ఏది అసత్యమో తెలియని నా లాంటి అయోమయాలకు ఙ్ఞానోదయం కలిగించండి...